నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

14 Jul, 2019 19:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని విధంగా కేంద్రం ఏపీకి సాయం చేసిందని తెలిపారు. కానీ దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని చెప్పారు. తన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్‌ ఫొటో ఎవరు పెట్టారో తెలియదని పేర్కొన్నారు. ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్‌ ఫొటో పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే తాను టీడీపీని వీడి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పుడే ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. ఏపీలో నాయకుల వలసలను ప్రోత్సహించడం బీజేపీ ఉద్దేశం కాదన్నారు.

గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకనే ఏపీ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీపై తాను రాజకీయ విమర్శలు చేయలేదని.. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలన అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు కూలిపోతున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమస్యలను బీజేపీకి అపాదించడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు