కేంద్ర మంత్రి పదవులకు సుజనా, అశోక్‌ రాజీనామా

9 Mar, 2018 02:20 IST|Sakshi

పార్టీ నిర్ణయం మేరకే బయటకు వచ్చాం

అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన సుజనాచౌదరి, అశోక్‌ గజపతిరాజు గురువా రం సాయంత్రం కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ప్రధాని మోదీని స్వయంగా ఆయ న నివాసంలో కలిసి అందజేశారు. వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కోరారు. రాజీనామాల అనంతరం మోదీ నివాసం నుంచి బయటకు వచ్చిన సుజనా, అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయడంలో విఫలమైనందున, రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్న ట్టు తెలిపారు. మంత్రి పదవులకు రాజీ నామా చేసినంత మాత్రానా ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్టు కాదని, 16వ లోక్‌సభ కాలం పూర్తయ్యే వరకూ ఎన్డీయే భాగస్వా మిగానే కొనసాగుతామని సుజనా చెప్పారు.

ఈలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన చేసి ఒక జాతీయ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేస్తే.. హామీలు అమలుచేయకుండా మరో జాతీయ పార్టీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2016 సెప్టెంబర్‌ 8న ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమవడంతో రాజీనామాలు చేయక తప్పలేదన్నారు. ఈ పరిస్థితి ఇంత దూరం రావడం దురదృష్టకరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారన్నారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మోదీ చెప్పారన్నారు.

ఆర్థిక బిల్లుకు మద్దతుపై దాటవేత
ఇదిలా ఉంటే.. కేంద్ర చివరి బడ్జెట్‌లో ఏపీ న్యాయం చేయలేదని చెబుతున్న టీడీపీ.. ఫైనాన్స్‌ బిల్లుకు మద్దతు ఇస్తుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సుజనాచౌదరి సమాధానం దాటవేశారు. సమయం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు