బీజేపీలో చేరిన సీనియర్‌ నటుడు

23 Apr, 2019 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియుష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్‌లోని  గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా సన్నీ డియోల్‌ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కష్టపడుతున్నారని, మరో ఐదేళ్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. యువతకు మోదీ లాంటి నాయకులు చాలా అవసరమని అన్నారు. అజల్‌బిహారి వాజపేయికి మద్దతు ఇచ్చి ఆయనతో కలిసి తన తండ్రి ధర్మేంద్ర పనిచేశారని, అదేవిధంగా తాను కూడా మోదీకి అండగా ఉంటానని అన్నారు. చేతల ద్వారానే రాజకీయాల్లో తానెంటో నిరూపించుకుంటానని చెప్పారు.

గతంలో గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ తరపున వినోద్‌ ఖన్నా ప్రాతినిథ్యం వహించారు. 2017లో ఆయన మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ జాఖర్‌ గెలుపొందారు. సన్నీ డియోల్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపి మళ్లీ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ పంజాబ్‌లోని 13 స్థానాల్లో 3 సీట్లలో పోటీ చేయనుంది. అమృత్‌సర్‌, గురుదాస్‌పూర్‌, హోషియాపూర్‌ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగుతోంది.

మరిన్ని వార్తలు