సాక్షి, షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రిగా ఎవరిని పెట్టాలనే విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం విషయమై అక్కడికి వెళ్లిన పరిశీలన బృందానికి పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పరిశీలకులుగా వచ్చిన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నేతలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ కమిటీ సమావేశ భవనం బయటే బీజేపీ సభ్యులు ప్రేమ్ కుమార్ దుమాల్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
'ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని చేయాలే తప్ప ఎలాంటి లాబీయింగ్ జరగొద్దు' అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ దుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్తగా ఎవరిని పెట్టాలనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క, కేంద్రమంద్రి జేపీ నడ్డా పేరును సీఎంగా ప్రకటిస్తారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.