రాహుల్‌పై పరువునష్టం కేసు

18 Apr, 2019 16:07 IST|Sakshi

పట్నా : దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. రాహుల్‌పై బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. పేరులో మోదీ అని ఉన్నవారందరినీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీ సందర్భంగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ఆయనపై బీజేపీ నేత సుశీల్‌ మోదీ గురువారం పట్నా చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ర్టేట్‌ ఎదుట ఫిర్యాదు చేశారు.

టీవీ వార్తా ఛానెల్స్‌లో ఈనెల 13న జరిగిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారమైందని, ఈ సందర్భంగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పిటిషన్‌లో సుశీల్‌ మోదీ పేర్కొన్నారు. తనతో సహా పేరులో మోదీ అని ఉన్న వారందరి ప్రతిష్టను ఆయన వ్యాఖ్యలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ఈనెల 22న విచారణకు చేపట్టనుంది. కాగా, నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకు ఉంటోందని రాహుల్‌ మహారాష్ట్ర ర్యాలీలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు