న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ స్పందిస్తూ.. భాజపా అధ్యక్షుడు అమిత్షాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'భారత రాజకీయాల్లో అపరచాణక్యుడిలా' అమిత్ షా మరోసారి నిరూపించారంటూ ట్టిటర్లో పేర్కొన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు వేసిన రాజకీయ ఎత్తుగడ తమకు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్న తరుణంలో శనివారం నాడు అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడానికి అమిత్షాయే కారణమంటూ సుశీల్ మోదీ ప్రశంసలు కురిపించారు.