నెటిజన్‌కు సుష్మా స్వరాజ్‌ ఝలక్‌!

4 Jul, 2018 12:03 IST|Sakshi

న్యూఢిల్లీ : భిన్న మతాలకు చెందిన ఒక జంటకు పాస్‌పోర్ట్‌ జారీ కావడానికి సహకరిస్తూ.. ఆ జంటను వేధించిన అధికారిని బదిలీ చేసేలా ఆదేశాలిచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు, దూషణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం సుష్మాకు మద్దతుగా నిలిచి, అలా వ్యక్తిగత దూషణలు చేయడం తప్పు అని నెటిజన్లకు సూచించారు. ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో.. ఓ నెటిజన్‌ మంచి రోజులు అంటే ఇవేనా.. అయితే మీరు నన్ను బ్లాక్‌ చేయండి అని ట్వీట్‌ చేయగా.. సరే అంటూ మంత్రి సుష్మాస్వరాజ్‌ తగిన రీతిలో స్పందించారు.

సోనమ్‌ మహాజన్‌ అనే నెటిజన్‌.. ‘ఆమె(సుష్మా) మంచి పాలన అందించడానికి వచ్చారు. మీకు మంచి రోజులు వచ్చేశాయి. సుష్మాజీ ఒకప్పుడు నేను మీకు వీరాభిమానిని. మీపై దూషణకు, అసభ్య పదజలానికి దిగిన వాళ్లతో పోరాడాను. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నన్ను మీరు బ్లాక్‌ చేయండి. రుణం తీర్చుకోండి. ఇందులో ఎదురచూడడానికి ఏం లేదంటూ’ ట్వీట్‌ చేశారు. సోనమ్‌ ట్వీట్‌కు తగిన రీతిలో సుష్మా స్పందించారు. ‘ఎదురుచూడటం ఎందుకు? ఇదుగో నిన్ను బ్లాక్‌ చేసేస్తున్నా’ అంటూ సుష్మా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

కాగా, లక్నోకు చెందిన మహ్మద్‌ అనాస్‌ సిద్ధిఖీ, తన్వీ సేథ్‌ దంపతులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోగా అధికారి వికాస్‌ మిశ్రా అనాస్‌ను పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారు. దీనిపై బాధితులు సుష్మాకు ఫిర్యాదు చేయగా.. ఆమె వెంటనే స్పందించి పాస్‌పోర్టు మంజూరు చేయించారు. అంతేకాకుండా వికాస్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యను కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సుష్మా తీసుకున్న నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఏకంగా ఇటీవల మీకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు.. ఇది మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా అంటూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు.

మరిన్ని వార్తలు