కాంగ్రెస్‌ ట్వీట్‌.. సెల్ఫ్‌ గోల్‌

27 Mar, 2018 16:21 IST|Sakshi
సుష్మా స్వరాజ్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై చేసిన పోస్ట్‌ వారికి సెల్ఫ్‌ గోల్‌ అయింది. ఇరాక్‌లో 39 మంది భారతీయులు మరణించడం.. విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ వైఫల్యంగా మీరు భావిస్తున్నారా? అంటూ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. దీనికి స్పందించిన నెటిజన్లు.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2900 మంది యూజర్లు ఈ ట్వీట్‌ను లైక్‌ చేయగా 3200 మంది రీట్వీట్‌ చేశారు. మొత్తంగా 33, 879 మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. 24 శాతం మంది సుష్మా వైఫల్యం చెందారని  ఏకీభవించగా... 76 శాతం మంది సుష్మాకు అనుకూలంగా ఓటేసి కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.

2014లో ఇరాక్‌లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్‌లో పంజాబ్‌కు చెందిన 39 మంది భారతీయ కూలీలు కిడ్నాప్‌కు గురయ్యారు. ఇంతకాలం వారంతా క్షేమంగా ఉన్నారంటూ చెప్పిన విదేశాంగ శాఖ.. వారు ప్రాణాలతో లేరంటూ గత వారం పార్లమెంట్‌లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ అంశపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో ఆందోళన చేసింది. అయితే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ట్వీట్‌ వారికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.

ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలను వారం రోజుల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. ఇందుకోసం విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ స్వయంగా ఇరాక్‌ వెళ్లి లాంఛనాలన్నీ పూర్తి చేస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు