బీజేపీ వైపు పరిపూర్ణానంద అడుగులు!

6 Sep, 2018 12:02 IST|Sakshi
స్వామి పరిపూర్ణానంద(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్‌ నగర బహిష్కరణ సమయంలో మద్దతుగా నిలవడం, తన సిద్దాంతాలకు సామీప్యం గల బీజేపీవైపు పరిపూర్ణానంద చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా హిందుత్వ కార్డును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తి పరిపూర్ణానందకు ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అయితే ఈ అంశంపై పరిపూర్ణానంద సూటిగా స్పందించలేదు.

‘నేను ఏ పార్టీలోకి చేరతాననీ చెప్పలేదు. నా సిద్దాంతాలు, ఆలోచనలకు సామీప్యం గల పార్టీ ఉంటే చేరుతాను. నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్లను.. వారి పార్టీకి అవసరం ఉంటే వారే వచ్చి అడగితే ఆలోచిస్తాను’ అంటూ పరిపూర్ణానంద పేర్కొన్నారు. అందరూ తనను యోగి ఆదిత్యనాథ్‌తో పోలుస్తున్నారని.. కేవలం వయసులో తప్పా మరొక అంశంలో ఇద్దరం సమానం కాదని వివరించారు. యోగికి రాజకీయాల్లో చాలా అనుభవం ఉందని, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ తరుపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. హిందుత్వం కోసం ఎవరు పాటుపడుతారో వారికి తన మద్దతు ఉంటుందన్నారు. ‘భారత్‌ మాతాకి జై’ అని అనడానికి ఎవరూ ఇష్టపడటం లేదని అసదుద్దీన్‌ ఓవైసీ అనడం హాస్యాస్పదమన్నారు. అది చెప్పడానికి ఓవైసీ ఎవరని ప్రశ్నించారు. హిందుత్వాన్ని ఎవరు గౌరవించరో వారికి తాను వ్యతిరేకమని, వారిపై ఎంతవరకైనా పోరాడతానని పరిపూర్ణానంద పేర్కొన్నారు.     


 

>
మరిన్ని వార్తలు