కేఏ పాల్‌పై పలు అనుమానాలు

13 Feb, 2019 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాశాంతి పార్టీ హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్‌ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు 10 వేల సభ్యత్వాలు చేయించమన్నారని, 21వ తేదీ రాకముందే వైజాగ్‌ సభలో శ్వేతారెడ్డి అడ్రస్‌ లేకుండా పోయానని తనను అనడం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.

హిందూపురం టికెట్‌ను ఇంకెవరికైనా అమ్ముకునేందుకు ఈ ప్రకటన చేశారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీకి ఎజెండా లేదని, ఓ సిద్ధాంతం లేదని ఆరోపించారు. కేఏ పాల్‌ నోరు తెరిస్తే ట్రంప్, ఒబామా అంటున్నారని, మిలియన్స్, ట్రిలియన్స్‌ డాలర్లు అంటూ.. అమరావతి అభివృద్ధికి రూ.10 కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సభ్యత్వం పేరుతో రూ.10, 100 ఎందుకు వసూలు చేస్తున్నారో వివరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. క్రిస్టియన్‌ కమ్యూనిటీని అవమానపరిచేలా పాల్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్‌ పాదయాత్ర చేశారని ఆమె స్పష్టంచేశారు.      

కేఏ పాల్‌కు శ్వేతారెడ్డి సంధించిన ప్రశ్నలు
మీరిచ్చిన గడువు ముగియక ముందే నా గురించి ఎందుకు మాట్లాడారు?
అసలు వైజాగ్‌లో నా టాపిక్‌ ఎందుకు మాట్లాల్సివచ్చింది?
మీరేమైనా హిందూపురం సీటును అమ్ముకోవాలని చూస్తున్నారా?
నేనేం తప్పు చేయకుండా బహిరంగ వేదికపై నా గురించి ఎందుకు మాట్లాడారు?
మీ పార్టీ సమావేశాలు నిర్వహించడానికి మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?
జర్నలిస్టులు అంటే చులకన భావం ఎందుకు?
దేవుడు బిడ్డ అబద్ధాలు ఆడకూడదని మీకు తెలియదా?
గడువు ముగియకుండా నా సమర్థతను ఎలా నిర్ణయించారు?
మాట మీద నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా?

మరిన్ని వార్తలు