‘ఐటీ గ్రిడ్స్‌’ చంద్రబాబుదే

10 Mar, 2019 01:12 IST|Sakshi

3.5 కోట్ల మంది ప్రజల సమాచారం ఆయన దొంగిలించారు

దొరికిపోతామనే అసహనంతో ఉన్నారు

ప్రభుత్వంలో దోచిన సొమ్ముతో హెరిటేజ్‌లో పెట్టుబడి

ఏ ప్రాజెక్టులో అయినా లోకేశ్‌కు 10% వాటా

పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిం చారని తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. ప్రజల సమాచారాన్ని దొంగిలించిన చంద్రబాబు ఇప్పుడు దొరికి పోతాననే అసహనంతో ఉన్నారన్నారు. ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చంద్రబాబుదేనని ఆయన మాటల్లోనే బయటపడిందని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో తలసాని విలేకరు లతో మాట్లాడుతూ బాబు ఆరోపిస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని ఏ ఒక్క ఐటీ కంపెనీవాళ్లు భయపడటం లేదని చెప్పారు. ‘డేటా దొంగిలించి తప్పు చేసింది చంద్రబాబు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఇన్ని రోజులూ ప్రైవేటు కంపెనీ అన్నారు. ఇప్పుడు తనదేనని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అద్భుతమైన డాక్యుమెంట్లు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాతే మీడియాకి ఇచ్చింది.  దొరికిపోతామని ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు ఉన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న ఏ ఐటీ కంపెనీ భయపడటం లేదు. టీడీపీ నేతల ఆస్తులు అన్నీ ఇక్కడే(తెలంగాణలో) ఉన్నాయి. మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా?  ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు కేసీఆర్‌ డబ్బులు పంపారని అనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. ఎన్నికల్లో డబ్బులు పంచె అలవాటు చంద్రబాబుతోనే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరపున చంద్రబాబు రూ.500 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికలలో డబ్బులు పంచితే వారిని చెప్పుతో కొట్టాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. ఏపీలో జీరో శాతం అవినీతి ఉంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఏ ప్రాజెక్టులో అయినా లోకేష్‌ 10 శాతం వాటా తీసుకుంటారు. చంద్రబాబు ఆరు కంటెనయిర్స్‌తో ఇటలీ టెక్నాలజీతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టారు. చంద్రబాబు తల్లిదండ్రులు దర్గాలో ఐదు ఎకరాలు, పంజాగుట్టలో పెద్ద బిల్డింగ్‌ కొన్నారా? ఆ ఆస్తులు మనవడికి గిఫ్ట్‌ ఇచ్చారా? గవర్నమెంట్‌లో దోచిన సొమ్మును హెరిటేజ్‌లో పెడుతున్నారు. విజయ డెయిరీకి రాని లాభాలు హెరిటేజ్‌కి ఎలా వస్తాయి.  నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు అసెంబ్లీలో దొంగ డ్రామా ఆడారు. ఐదేళ్లుగా పసుపు కుంకుమ, రైతు నేస్తం ఎందుకు ఇవ్వలేదు. ఎన్నికల్లో కేసీఆర్‌కు చంద్రబాబు ఏమాత్రం పోటీ కాదు’అని తలసాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు