నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలవాలి: కేటీఆర్‌

9 Oct, 2018 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో గెలిచేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆ జిల్లా నేతలకు సూచించారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ అభ్యర్థి భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్‌ సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార సరళిని కేటీఆర్‌ తెలుసుకున్నారు. మిర్యాలగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని, ప్రభుత్వంలో అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని సుఖేందర్‌రెడ్డి, విజయసింహారెడ్డిలకు సూచించారు. డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కేటీఆర్‌ను కోరారు.

కాంగ్రెస్‌ బట్టేబాజ్‌ పార్టీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
పటాన్‌చెరు: ‘కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌ చేసిన దీక్షపై పనికిరాని విమర్శలు చేస్తున్నారు. అదో బట్టేబాజ్‌ పార్టీ’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సోమవారం ఆయన గొల్ల, కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 40 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం గొల్ల, కుర్మల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం గొల్ల, కుర్మల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేసిందన్నారు. 

తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేసిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉం దని, ఇంటెలిజెన్స్‌ నివేదికలతో అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ఇక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలుస్తూ తెలంగాణపై ప్రకటన చేశారని గుర్తు చేశారు. దొంగదీక్షలు చేసి ఉంటే అప్పుడే కాంగ్రెస్‌ బయటపెట్టి ఉండొచ్చు కదా అని నిలదీశారు. ఇప్పుడు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు