సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ జరిగిందన్నారు. ఈ సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సంక్షేమ కార్యక్రమాలు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. కడుపు కట్టుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కోసం కష్ట పడుతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన ఏనాడైనా చేశారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పద్దతి ప్రకారమే ఆర్టీసీ బస్సులను వాడుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని, ఎక్కడా పన్నులు పెంచలేదన్నారు.