కూటమికి భయపడటం లేదు: తలసాని

7 Oct, 2018 02:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మహా కూటమికి తాము భయపడటం లేదని, రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు ప్రాతిపదిక ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఆ పార్టీ వారే భయపడరని, తామెలా భయపడతామని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల తర్వాత దొంగ కూటమి కళ్లు బైర్లు కమ్మాయి. మహా కూటమిలో పొత్తు, సీట్లు ఖరారయ్యాక అసలు మజా ఉంటుంది.

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌ దీక్షపై భట్టేబాజ్‌ మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నవి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగానే చిదంబరం ప్రకటన చేశారు. సైన్యంలో ఉత్తమ్‌ ఉద్యోగిలా పనిచేసి ఆ తర్వాత పైరవీలతో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని దొంగ మాటలు మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో ఏం జరగలేదంటున్న కాంగ్రెస్‌ నేతలు.. మీ ఇళ్లల్లో 24 గంటల కరెంటు, మిషన్‌ భగీరథ నీళ్లు, రైతుబంధు చెక్కులు రావడం లేదా..? నా వెంట వస్తే అభివృద్ధి పనులు చూపిస్తా. గొర్లు, బర్లు ఇస్తారా అంటూ బలహీన వర్గాలను అవమానిస్తున్నారు. బీజేపీకి ఇప్పుడున్న 5 అసెంబ్లీ సీట్లు కూడా రావు. రాష్ట్రంలో సెటిలర్లు అంటూ ఎవరూ లేరు. ఆ పదాన్ని నిషేధించాం. ఓట్ల కోసం మహాకూటమి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతోంది.  మాకు ఎవరితో రహస్య ఒప్పందాలు లేవు. ఎంఐఎం మా మిత్రపక్షం.  10 సీట్ల కోసం టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పక్క రాష్ట్రంతో గెలుక్కుంటోంది’అని అన్నారు.

మరిన్ని వార్తలు