ప్రతిపక్షనేత ఆచూకీ చెపితే.. బహుమతి

21 Jun, 2019 19:20 IST|Sakshi

పట్నా: బిహార్‌ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతా దళ్  (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, తేజస్వీ యాదవ్ ఆచూకీ చెప్పినవారికి బహుమతి ఇస్తామని సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. తేజస్వీ యాదవ్ ఫొటోతోపాటు తన ఫొటోను కూడా హష్మీ ఫోటీను కూడా పొస్టర్‌లో ముద్రించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలనప్పటి నుంచి తేజస్వీ యాదవ్ కనిపించడం లేదని హష్మీ ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. తేజస్వీని చూసినవారు, లేదా, ఆయన ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ విధంగా సమాచారం ఇచ్చినవారికి రూ.5,100 బహుమతి ఇస్తామని పోస్టర్‌లో పేర్కొన్నారు.
ఆయన ప్రపంచకప్‌ చూస్తూ బిజీగా ఉండొచ్చు..

కాగా బిహార్‌లోని ముజఫర్‌పూర్‌, దాని పరిసర జిల్లాల్లో మెదడువాపు  వ్యాధి బారినపడి సుమారు 150 మంది చిన్నారులు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.  సమస్య తీవ్రంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను ఓదార్చుతున్నారు. కానీ ఇప్పటి వరకు తేజస్వీ మాత్రం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.  దీనిపై ఇటీవల ఆర్జేడీ ఓ సీనియర్‌ నేత మాట్లాడుతూ.. తేజస్వీ ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను చూస్తూ.. బిజీగా గడుపుతూ ఉండొచ్చంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పొందడంతో తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.


 

మరిన్ని వార్తలు