చంద్రబాబు నామినేషన్‌కు భిక్షం పెట్టండి ప్రభూ

23 Mar, 2019 09:01 IST|Sakshi
కుప్పం టీడీపీ కార్యాలయంలో భిక్షాటన కోసం సిద్ధం చేసిన పసుపు బిందెల హుండీలు

గుడుపల్లె(చిత్తూరు జిల్లా):  చంద్రబాబు.. నామినేషన్‌ వేసేందుకు డబ్బులు లేవని భిక్షం పెట్టండి ప్రభూ.. అంటూ ఇంటింటా భిక్షాటన చేసేందుకు పసుపు బిందెల హుండీలను టీడీపీ వారు తయారు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు నామినేషన్‌ వేసేలోపు బిందెల్లో డబ్బులు నింపుకుని రావాలని కార్యకర్తలకు నాయకులు ఆదేశించారు. బిందెలపై ఎన్టీఆర్, చంద్రబాబు, సైకిల్‌ గుర్తుల ఫోటోలను అతికించి బిందెకు పైన పసుపు బట్టతో చుట్టి హుండీలా తయారుచేశారు.

గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోను, గుడుపల్లెలోని 18  గ్రామ పంచాయతీలకు సంబంధించి 18 పసుపు బిందెలను పంపిణీ చేశారు. అయితే  నాలుగేళ్ళుగా గ్రామాల్లో తమకంటూ స్థానం ఇవ్వలేదని  ఇప్పడు బిందెలు తీసుకుని ఎలా వెళ్ళమంటారని టిడిపి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ‘‘కాంట్రాక్టు, సిమెంట్‌ రోడ్డు పనుల్లో కమీషన్‌లు పంచుకున్న నాయకులు బిందెలను నింపగలరు కానీ,  మాలాంటి పేదలకు ఒక్క రూపాయి వేసేందుకు కూడా కరువైంది’’ అని కార్యకర్తలు అంటున్నారు. దీంతో పసుపు బిందెలను గ్రామాల్లోకి తీసుకుని వెళ్ళేందుకు తెలుగు తమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు