టీడీపీ వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్న తమ్ముళ్లు
అధినాయకుడి సుపుత్రుడి దగ్గర మార్కులు కొట్టేసే యత్నం
తాడేపల్లి రూరల్ (మంగళగిరి) : తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారిని తీసుకొచ్చి కొత్తగా పార్టీలో చేరుతున్నారంటూ కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, శనివారం లోకేశ్ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వర్గానికి చెందిన వారే. అయితే ఇప్పుడు మాత్రం వైఎస్సార్ సీపీనుంచి వచ్చినట్లు చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీ వర్గాలు మాత్రం మల్లికార్జునరావుకు కనీసం పార్టీ సభ్యత్వం లేదని తెలిపారు. మహానాడు, అంజిరెడ్డి కాలనీ, మరికొన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీల నుంచి టీడీపీలోకి భారీగా వలస వచ్చారని స్థానిక నేతలు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ వద్ద ప్రగల్భాలు పలికారు. అయితే వీరంతా తాడేపల్లి జెడ్పీటీసీ శైలజారాణి, మాజీ ఎంపీటీసీ, టీడీపీలోంచి సస్పెండ్ అయిన బీసీ నాయకుడు నూతక్కి ఏడుకొండలు ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారే. ఈ ఏడాది జరిగిన మహిళా దినోత్సవంలోనూ వీరంతా చంద్రబాబునాయుడుకు జేజేలు కొట్టిన వారే. గతంలో ఎప్పటినుంచో ఉన్న టీడీపీ కార్యకర్తలనే వివిధ పార్టీలనుంచి వచ్చి టీడీపీలో చేరారని స్థానిక నేతలు ప్రచారం చేయడం.. ముఖ్యమంత్రి కొడుకు లోకేశ్ పరవశించిపోవడం పలు విమర్శలకు గురవుతోంది.