కర్నూలు టీడీపీలో అసమ్మతి సెగ

13 Feb, 2019 16:07 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కోట్ల సుజాతమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. కోట్ల సుజాతమ్మను ఆలూరు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ విషయంపై భగ్గుమంటున్నారు. ఆలూరు టికెట్‌ బీసీలకే కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తే సహించేది లేదని టీడీపీ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ కురువ జయరాం, ఎంపీపీ పార్వతి తేల్చి చెప్పారు.

కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి,  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్‌ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

మరిన్ని వార్తలు