సాక్షి, విజయవాడ : ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షం ఆత్మ స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను నయానో..భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడుతోంది.
ఎంతకైనా తెగిస్తూ..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంతకైనా తెగించేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధమయ్యారు. తిరువూరులో మంత్రి జవహర్ గెలుపు కోసం బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అక్కపాలెం అనే గ్రామంలో సర్పంచ్ భర్త నాగేశ్వరరావును టీడీపీ గూండాలు హత్య చేశారు. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తే నాగేశ్వరరావు వద్దకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలోని నాయకులు ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రక్షణ నిధి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణులు పనిచేయడం ప్రారంభించాయి.
గ్రామాల్లో జన్మభూమి కమిటీ బెదిరింపులు..
గత నాలుగున్నర ఏళ్లుగా గ్రామాల్లో పెత్తనం సాగించిన జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఏ మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఓటు వేసినా వారి తెల్లకార్డులు, పింఛన్లు రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత నెల రోజుల వరకు కౌంటింగ్ జరగదని ఈ లోగా తమ ప్రభుత్వం పింఛన్లు, కార్డులను రద్దు చేయిస్తామంటూ మైలవరం, నందిగామ, అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాల్లో జోరుగా బెదిరింపులకు దిగుతున్నారు.
గత ఐదేళ్లుగా వారి పెత్తనం చూసిన గ్రామస్తులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మరోకవైపు తమ పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది.