‘ప్రభుత్వమే రైతుల పంట తగలబెట్టించింది’

19 Nov, 2018 16:06 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఫైల్‌)

సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదన్న కోపంతో ప్రభుత్వమే రైతుల పంటలను తగలబెట్టించిందని వైఎస్సార్‌ సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఆ నెపాన్ని వైఎస్సార్‌ సీపీపై నెట్టిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలైనా వైఎస్సార్‌ సీపీ తప్పు చేసిందని నిరూపించే ఒక్క ఆధారాన్ని బైట పెట్టలేకపోయిందని చెప్పారు. పంటలు తగలబెట్టించిన విషయంలో వైఎస్సార్‌ సీపీకి సంబంధం ఉంటే ఆధారాలు బైటపడేవన్నారు.

ఇన్నాళ్లు వైఎస్సార్‌ సీపీపై టీడీపీ చేసిన ప్రచారం తప్పని తేలిందన్నారు. రాజధాని రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్‌ సీపీపై, జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పేర్కొన్నారు. తుని, విశాఖ ఎయిర్‌ పోర్టు సంఘటనల్లో కూడా వైఎస్సార్‌ సీపీకి సంబంధం ఉందని చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు