కుమారుడు, కుమార్తెతో కలిసి సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ
వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్న పలువురు నేతలు
అధికారపార్టీకి ఎస్సీ సామాజిక వర్గం మద్దతు
శింగనమల: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆయా వర్గాలన్నీ ఆయన వెంటనే నడుస్తున్నాయి. ఈక్రమంలోనే వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ వారి అనుచరులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఏపీ ప్రాథమిక విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ కనుమరగవుతోంది. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ శమంతకమణి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడున్న టీడీపీ కేడర్ అంతా ఆమె ద్వారా వచ్చినవారే. కానీ ఇప్పుడు శమంతకమణి కుటుంబం ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో... నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వ లోటు ఏర్పడింది. దీంతో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు.
ఎస్సీ సామాజిక వర్గమంతా వైఎస్సార్సీపీ వైపే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండగా... అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఎస్సీ సామాజికవర్గంలో జిల్లాలోనే బలమైన నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ శమంతకమణి వైఎస్సార్సీపీలో చేరడంపై ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారంతా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు.