తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదు: ఎర్రబెల్లి  

31 Oct, 2017 03:01 IST|Sakshi

తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదని, ఆ పార్టీని వీడాలనుకునే వారు ముందుగా టీఆర్‌ఎస్‌ తలుపుతడుతున్నారని, రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లోకి వెళుతున్నారని ప్రచారంలో ఉన్న నేతలంతా తనను కలసిన వారేనని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌ ఇప్పటికి నాలుగు పార్టీలు మారిండు. ఇప్పుడు రేవంత్‌ను కలసిన నేతలంతా ముందు నన్ను కలసిన వారే. వాళ్లందరినీ తీసుకొస్తే ఎలా అకామిడేట్‌ చేస్తాం?.. పదవులు ఎలా ఇస్తాం?.. ఎవరైనా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరడానికే ప్రియారిటీ ఇస్తారు. టీడీపీకి ఫ్యూచర్‌ లేదు.. అందుకే కొందరు కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. నాకిప్పుడు ఏ పదవీ అక్కర్లేదు. ఉన్న ఏడాదిన్నర టైమ్‌కు పదవి ఎందుకు? పదవి కోసం పార్టీ మారిండని అనరా?. నాకున్న పేరుకు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడైనా గెలుస్తా. కానీ నియోజకవర్గం మారను. టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటది’అని ఆయన పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌కు శనిపట్టినట్లే..
‘‘రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లే. రేవంత్‌ది ఐరన్‌ లెగ్‌. అందుకే టీడీపీ నాశనమైపోయింది. మేం 30 ఏళ్లు పార్టీని అభివృద్ధి చేస్తే రేవంత్‌ వచ్చిన ఆరేళ్ల లోభ్రష్టుపట్టించాడు. రేవంత్‌ తన భాష మార్చుకోవాలి.’’     
- ఎమ్మెల్యే మాధవరం

రేవంత్‌ పోవడంతో నష్టమేమీలేదు  
‘‘కొత్తకోట దయాకర్‌ రెడ్డి, సీతక్క మాతోనే ఉంటారు. వారు పార్టీ మారుతారని వస్తున్న వార్తలు అవాస్తవం. కొన్ని రోజులు ఇలాంటి పుకార్లు వస్తాయి. రేవంత్‌ రెడ్డి టీడీపీని వీడిపోవడంతో పార్టీకి నష్టం లేదు.’’   
- ఎమ్మెల్యే  సండ్ర వెంకట వీరయ్య

మరిన్ని వార్తలు