పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

4 Sep, 2019 13:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తన పుట్టిన రోజు బైక్‌ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చిందులు తొక్కారు. పోలీసులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్‌ ర్యాలీ చేయాలట... బండ్లు నడపకుండా తోసుకుని పోలీసు స్టేషను వరకు వెళ్లాలి అంటూ పోలీసులను ఎద్దేవా చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సీనియర్‌ నాయకులు వస్తారని.. రక్తదాన శిబిరాలు పెడతానంటే అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరు ఏం చెప్పినా తాను తగ్గనని.. అనుకున్నది చేసి తీరతానని పేర్కొన్నారు. తన గురించి తెలుసు కాబట్టే కలెక్టర్‌ తర్వాత పర్మిషన్‌ ఇచ్చారని తెలిపారు. మూడేళ్లలో అందరి కళ్ళు దింపుతామంటూ పోలీసులను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా... అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.  విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్‌ తింటున్నారు.

మరిన్ని వార్తలు