సాక్షి, అమరావతి : పల్నాడులో మొదలైన రాజకీయ వేడి ఆత్మకూరును తాకేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోటాపోటీగా ప్రతిపక్ష టీడీపీ, అధికార వైఎస్సార్సీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో ఆయా పార్టీల నేతలు బుధవారం ఉదయం పల్నాడుకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజకీయ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు.
(బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్)
అయితే, టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీసుల్ని లెక్కచేయలేదు. హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ అఖిలప్రియకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. తనను ఆపేందుకు హక్కెవరిచ్చారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. తన అనుచరులతో కలిసి మహిళా ఎస్సైపై జులుం ప్రదర్శించారు. వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ‘నేనెవరో తెలుసా’ అంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.