తనపై దాడి జరిగిన తర్వాత రాజకీయం చేయకుండా హుందాగా వ్యవహరించారు: టీడీపీ నేత జూపూడి
సాక్షి, అమరావతి: తనపై తాను హత్యాప్రయత్నం చేయించుకొని, దాన్ని రాజకీయం చేసే వ్యక్తిత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డిది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావే అన్నారు. మంగళవారం సచివాలయంలో పబ్లిసిటీ సెల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా హుందాగా ఎలాంటి రాజకీయం చేయకుండా హైదరాబాద్కు వెళ్లిపోయారని.. చుట్టపక్కల ఉండే వాళ్లే తర్వాత దీన్ని రాజకీయం చేశారని వ్యాఖ్యానించారు.
జగన్పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలలే హత్యాయత్నం చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అతడి విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఒక ప్రశ్నకు బదులుగా జూపూడి అన్నారు. సినిమా సీరియస్గా సాగుతుంటే మధ్యలో బ్రహ్మానందం కామెడీ మాదిరి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని.. టీడీపీ కూడా ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోలేదని తెలిపారు. గవర్నర్ ఢిల్లీ ఏజెంట్గా మారిపోయారని.. జగన్పై జరిగిన హత్యాయత్నం టీ కప్పులో తుఫాన్లాంటి సంఘటనగా పోల్చుతూ ఏమీ లేని చోట గవర్నర్ డీజీపీ నివేదిక కోరడం ఏంటని ప్రశ్నించారు.