ఏపీ టు కేపీ!

29 Nov, 2018 09:05 IST|Sakshi

కూకట్‌పల్లిలో తిష్టవేసిన టీడీపీ నాయకులు

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్‌ నియోజకవర్గాలతో పాటు సెటిలర్స్‌ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కార్యకర్తలు భారీగా వచ్చారు. కూకట్‌పల్లి కేంద్రంగా చేసుకొని ఇక్కడ తిష్టవేశారు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని టీడీపీ తరపున బరిలో ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఓ కళాశాల హాస్టల్‌లో వీరికి వసతులు ఏర్పాటు చేసినట్లు ప్రచారమవుతోంది. స్థానికంగా ఉన్న కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంధ్రా నుంచి వచ్చిన కార్యకర్తలే ప్రచారాన్ని తన చేతుల్లోకి తీసుకొని అపార్ట్‌మెంట్‌ల వద్దకు వెళ్ళి ఏకంగా బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. 

కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీలో టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమ్యూనిటీహాల్‌లోనే వంటలు చేసి సమావేశం ఏర్పాటు చేస్తుండగా దీనిని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ప్రశ్నించినందుకు పలువురు నాయకులు ఆయనపై చేయిచేసుకొన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులకు ఇక్కడ ఓట్లు లేకపోయినప్పటికీ అన్నీ తానై ప్రచారం చేయడంతో స్థానిక టీడీపీ  నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉండటం గమనార్హం. కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి చెడగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు