‘మినీ’ లుకలుకలు

19 May, 2018 09:12 IST|Sakshi
సత్యవేడులో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సుందరరామిరెడ్డి వాగ్వాదం (ఫైల్‌)

అసంతృప్తి..ఆగ్రహానికి వేదికలుగా టీడీపీ మినీ మహానాడు

ఎక్కడికక్కడ భగ్గుమంటున్న నాయకులు

నేతలకు తలనొప్పిగా మారిన వైనం

నచ్చజెబుతున్నా దారికి రాని ‘తమ్ముళ్లు’

జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడు సమావేశాలు అసంతృప్తులకు..విభేదాలకు వేదికగా నిలుస్తున్నాయి. ఎవరికి వారు తమ అసంతృప్తిని..ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి దీనిని మార్గంగా ఎంచుకుంటున్నారు. అలకలు తీర్చడం..     ఆగ్రహాన్ని చల్లార్చడం నేతలకు     తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని సమావేశాల్లో ఈ తరహా సన్నివేశాలు కనిపించాయి.

సాక్షి, తిరుపతి: జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన టీడీపీ మినీమహానాడు సమావేశాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇటీవల తిరుపతి మినీ మహానాడులో నాయకులు, కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై  విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన నాయకులను పార్టీలోకి తీసుకుని మళ్లీ అదే సమస్యలను తెచ్చి పెడుతున్నారని సీనియర్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరంభం నుంచి  కష్టపడి పనిచేస్తున్నా æ అధికారం వచ్చాక కూడా తమకు ఆ భావన  కలగడంలేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం బాలాజీ, బుల్లెట్‌ రమణ, గుణశేఖర్‌నాయు డు తదితరులు ఆవేదన వ్యక్తం చే శారు. తిరుపతి నాయకులంటే అధినాయకుల దృష్టిలో చులకనభావం నెలకొందని ఆగ్రహం చెం దారు. బీజేపీ, జనసేన నాయకులకు గతంలో టీటీడీ చైర్మన్‌ పదవి తోపాటు ఇద్దరికి బోర్డు మెంబర్లుఇచ్చారని గుర్తు చేశారు.  ఈ సారి ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తిరుపతిలో తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప ప్రాధాన్యత ఇవ్వడంలేదని బలిజ సామాజిక వర్గ నేతలు మండిపడ్డారు.  నామినేటెడ్‌ పదవుల్లోనూ అన్యాయం చేశారన్నారు.

సత్యవేడు మినీ మహానాడులో ఎమ్మెల్యే ఆదిత్యపై నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర భుత్వ పథకాల మంజూరులోనూ ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటూ అవమానిస్తున్నారని ఆరోపించారు. పార్టీ గుర్తింపు కార్డు ఇవ్వటంలోనూ ఎమ్మెల్యే వివక్ష ప్రదర్శించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజల్లో చొచ్చుకుపోతున్నారంటూ పలువురు నాయకులు సు ధీర్ఘంగా చర్చించుకున్నారు. ఆమె వేగాన్ని ఎలా కట్టడి చేయాలనే అంశంపై మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ వర్గీయులు ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు భోగట్టా.
చంద్రగిరిలోఅధిష్టానం తీరుపట్ల నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లె  మినీ మహానాడుకు స్థానిక నాయకులు ఎవ్వరూ హాజరుకాలేదు. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో పాటు... పార్టీ వర్గాలుగా విడిపోవటానికి ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌  కారణమయ్యారని  స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  
జిల్లా వ్యాప్తంగా మినీ మహానాడు నిర్వహణపై ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీలో వర్గాలుగా చీలిపోవటంతో నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో నిర్వహించే మినీ మహానాడుకు హాజరు కాలేమని తేల్చి చెబుతున్నారు. అందువల్లే మిగిలిన నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన మినీ మహానాడు సమావేశాలు ఆలస్యం అవుతున్నాయని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. గొడవులుంటే తరువాత చూసుకుందాం... మినీ మహనాడు కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయండంటూ ఓ వైపు మంత్రి, మరో వైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయకులను చెబుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు