ఓటమి భయంతో టీడీపీ దాడులు

8 Apr, 2019 13:02 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరిన వేళ టీడీపీ నేతలు అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరలేపారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అడ్డుకున్నవారిపై వీధి రౌడీల్లా రెచ్చిపోతూ దాడులకు పాల్పడున్నారు. లోలోపల దాగి ఉన్న ఓటమి భయంతో విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ అభ్యర్థి నందిగం సురేష్‌ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు.

టీడీపీ నేతల దౌర్జన్యం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. శ్రీరామ్ నగర్ కాలనిలో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వాహనంలో పీఎస్ కు తరలించారు. సమాచారం తెలుకున్న టీడీపీ నేతలు వాహనాన్ని మార్గ మధ్యలో అడ్డుకోని పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసు వాహనంలో ఉన్న తమ కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద టీడీపీ నేతలు దాడి చేశారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లోని వలసపాకల పద్మానగర్ లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత సానబాలను సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రూ.75 వేల నగదు, ఓటర్ లిస్ట్, స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు