జలీల్‌ ఖాన్‌పై భగ్గుమంటున్న టీడీపీ నేతలు

24 Jan, 2019 12:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని జలీల్‌ఖాన్‌ ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ కేటాయించినట్టు చంద్రబాబు చెప్పకుండానే జలీల్‌ ఖాన్‌ ప్రచారం చేసుకోవడం ఏమిటని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు కన్నెర్ర జేస్తున్నారు. ఈమేరకు జలీల్‌ ఖాన్‌పై వారు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జలీల్‌ ఖాన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం నేతలు విమర్శిస్తున్నారు.
 
ఇటీవల జలీల్‌ఖాన్‌ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్‌ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు