పవన్‌ పర్యటనలో టీడీపీ నేతలు

31 Aug, 2019 04:57 IST|Sakshi

మంగళగిరి/తుళ్లూరు రూరల్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం పలువురు టీడీపీ నేతలతో కలసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని  ఐనవోలు, ఉప్పలపాడు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. సమస్యలు తెలుసుకునే పేరిట పవన్‌ చేసిన పర్యటనలో పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

చంద్రబాబు ఆదేశంతోనే పవన్‌ రాజధానిలో పర్యటిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. కాగా, రాజధాని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్‌కళ్యాణ్‌ గ్రామాల్లోని పలుచోట్ల స్థానికులతో మాట్లాడారు. రాజధానిని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదని అన్నారు. రాజధాని పేరుతో దోపిడీలకు, అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే..వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, మంగళగిరి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్యతో పాటు పలువురు టీడీపీ నాయకులున్నారు. 

మరిన్ని వార్తలు