‘వాళ్లకు జగన్‌, పవన్‌ ఫోబియా’

20 Mar, 2018 18:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లను చూసి తెలుగుదేశం పార్టీ వణికిపోతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాం కిషోర్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘టీడీపీ నేతలకు జగన్‌, పవన్‌ ఫోబియా పట్టుకుంది. వాళ్లిద్దరినీ చూసి ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్‌పై వ్యతిరేకతతో టీడీపీ సినిమా రంగంపై నోరుపారేసుకుంటోంది’ అని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలను కిషోర్‌ ఉటంకించారు. రాష్ట్ర విభజన సమయంలో మౌనం వహించిన పార్టీలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంపై మాటలు పేలుతున్నాయని మండిపడ్డారు.
 
టీడీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప, ఏనాడూ రాష్ట్రం కోసం పనిచేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు లేనిదే ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి అభివృద్ధి సాధ్యమా? అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేస్తున్నా.. రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ బీజేపీ సర్కార్‌పై టీడీపీ నాయకులు పదే పదే బురద చల్లుతున్నారని కిషోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ది కన్నా.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దే బీజేపీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ‘పూటకో రాజకీయ నాటకం ఆడుతున్న టీడీపీ నేతల ఆగడాల్ని ప్రజలు గమనిస్తున్నారు. మీకు తొందర్లోనే తగిన బుద్ది చెప్తారు’ అని కిషోర్‌ హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు