పార్టీని నమ్ముకుని నష్టపోయాం

15 May, 2018 09:20 IST|Sakshi
అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాలాజీ

తిరుపతి మినీ మహానాడులో

‘తమ్ముళ్ల’ ఆవేదన

తిరుపతి తుడా: ‘పార్టీ స్థాపించిన నాటి నుంచి జెండాలు మోశాం. అధికారంలో లేనపుడు కష్టపడి పోరాటాలు చేశాం. అయినా అన్నింటా అన్యాయం జరుగుతూ ఉంది’ అని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గ మినీ మహానాడు సోమవారం ఎంవీఆర్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ మాట్లాడుతూ పార్టీ స్థాపన నుంచి కష్టపడి పనిచేస్తున్నానన్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నా అలాంటి భావన కలగడం లేదన్నారు. ఇది 100లో 95 శాతం మంది  మనోవేదనగా ఆయన చెప్పుకొచ్చారు.

తిరుపతి నేతలకు గతంలో టీటీడీ చైర్మన్‌తో పాటు బీజేపీ, జనసేన  నుంచి ఇద్దరిని బోర్డు మెంబర్లుగా నియ మించారని, ప్రస్తుతం నాయకులు పనికిరాకుండా పోయారా అని ప్రశ్నించారు. జిల్లా నాయకుడు బుల్లెట్‌ రమణ మాట్లాడుతూ టీడీపీ బలిజలను ఓట్ల కోసం వాడుకుంటోందే తప్ప పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ గుణశేఖర్‌ నాయుడు మాట్లాడుతూ పదవుల మాట దేవుడెరుగు కార్యకర్తలకు కనీస రక్షణ కరువైందన్నారు. వీరికి మరింత మంది నాయకులు గొంతుకలపడంతో గందరగోళం నెలకుంది. ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్‌ నరసింహా యాదవ్‌లు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయారు. ఎమ్మెల్యే సుగుణమ్మ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

మరిన్ని వార్తలు