కోళ్లు లాక్కున్నందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. !

16 Jan, 2019 19:07 IST|Sakshi

సాక్షి, అనంతపురం : కోడి పందేలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ అధికార జులుం ప్రదర్శించారు. వివరాలు.. పందేలు నిర్వహించనున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం అంకాలమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. పందేలకు సిద్ధంగా ఉన్న నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకుని జీపులో వేసుకుని వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే  జితేంద్ర గౌడ్‌ వారి జీపును చేజ్‌ చేశారు. పోలీసుల జీపునకు అడ్డం తిరిగి వీరంగం సృష్టించారు. ఏఎస్సై తిరుపాల్‌పై దౌర్జన్యం చేశారు. కోళ్లు లాక్కుని పందెం రాయుళ్లకు అప్పగించారు. ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే ఊరుకోనని పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పరుష పదజాలంతో తిట్టడంతో పోలీసులు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కోడి పందాళ్లో పలువురికి గాయాలు..
గుడివాడ : అధికార పార్టీ నాయకుల అండదండలతో గుడివాడలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వలంటీర్‌గా ఉండి పందేలను వీక్షిస్తున్న ఓ వ్యక్తిపై టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలవారు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు