పార్టీ మారిన వారిని వదలను ..

18 Mar, 2019 14:15 IST|Sakshi
పుట్టా సుధాకర్‌యాదవ్‌

పుట్టా సుధాకర్‌యాదవ్‌  

సాక్షి, చాపాడు : అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు పార్టీ మారుతున్న వారిపై కక్ష సాధిస్తానని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు. మీరు నమ్ముకుని వెళుతున్న నాయకులు ఈ ఎన్నికల్లో మాత్రమే ఉంటారని.. తానే మరో 20 ఏళ్ల వరకు పోటీలో ఉంటానని ఎవరినీ వదలిపెట్టనన్నారు. మండలకేంద్రమైన చాపాడులో ఆదివారం టీడీపీ కార్యాలయం ప్రారంభించిన పుట్టా మాట్లాడుతూ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీలోకి మారడం తప్పని తనను నమ్మించి పార్టీలోకి చేరిన వారు ఇప్పుడు నాకు సినిమా చూపిస్తున్నారని, తాను కూడా పది సినిమాలు చూపిస్తానన్నారు.

మొదట్లో తెలియక తప్పులు చేశానని, ఇప్పుడు రాజకీయాల గురించి తెలుసుకున్నానన్నారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారని కారణాలు అడిగితే బంధువులు అని, కార్యకర్తలంటూ కథలు చెబుతున్నారని పార్టీలోకి వచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, గోసుల కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు