గన్నవరంలో వేడెక్కుతున్న రాజకీయం
సాక్షి, గన్నవరం : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా... కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇంకా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి ఇటీవల వల్లభనేని వంశీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వంశీ నుంచి తనకు ప్రాణహాని ఉందని యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ రాశారు. యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడాలనే తాను ఆయన ఇంటికి వెళ్లానంటూ వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.