‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’

22 Jan, 2020 17:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేలా టీడీపీ చేస్తున్న కుయుక్తులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్‌లో.. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా యాక్షన్‌ చేశారో తెలిపే వీడియో ఒకటి బయటికొచ్చింది. మండలిలో తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో టీడీపీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారు అలా చెబుతుంటే చంద్రబాబు చాలా బాగా చేశారని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. టీడీపీ సభ్యులు బెజవాడ రౌడీయిజం అని ఓ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు విస్తుపోతున్నారు.  హుందాగా ఉండాల్సిన పెద్దల సభలో టీడీపీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చున్నా.. చాలా బాగా చేశారు. నేను ఒకటి.. రెండు సార్లు వచ్చి చూశాను. మిగతావి స్క్రోలింగ్‌ చూస్తున్నా.. ఎప్పుడూ మాట్లాడినా గొడవ పడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు రావడం అంతా చూశాన’ని చెప్పారు. దీనికి బదులిచ్చిన తమ్ముళ్లు.. ‘అశోక్‌ బాబులో రౌడీని చూశామని..  మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్‌.. ఏయ్‌ అని బాగా అరిచారు. కొంచెం ఉంటే కొట్టేవాడు. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడ’ని చెప్పారు. టీడీపీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా కనిపించారు.

మరిన్ని వార్తలు