‘మండలి’లో రౌడీయిజం చేశాం..

23 Jan, 2020 04:59 IST|Sakshi
మండలిలో రౌడీయిజం చేశామన్న టీడీపీ ఎమ్మెల్సీలను ప్రశంసిస్తున్న చంద్రబాబు

చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు

‘గుడ్, బాగా చేశారు’.. అంటూ బాబు ప్రశంసలు

అశోక్‌బాబులో రౌడీని చూశాం.. 

కొంచెం ఉంటే మంత్రులను కొట్టేవాడు

బెజవాడ రౌడీయిజం చూపెట్టాడు 

ఎమ్మెల్సీల మాటలతో బాబులో ఉత్సాహం

వీడియో వైరల్‌.. అభాసుపాలైన టీడీపీ

సాక్షి, అమరావతి: శాసన మండలిలో రౌడీయిజం చేశాం సార్‌’.. అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో జరిపిన సంభాషణ బుధవారం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్‌ అయింది. నెటిజన్లందరూ ఈ వీడియో చూసి దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర అభాసుపాలైంది. ఆ వీడియోలో ఏముందంటే..

అసెంబ్లీ ఆమోదించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో ఆ పార్టీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. సభలో ఆ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పాల్సిన చంద్రబాబు అలాంటి సలహాలేవీ ఇవ్వకుండా.. ‘ఓకే గుడ్‌. బాగా చేశారు’.. అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాక.. ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చుని మండలిలో జరిగే చర్చ చూశాను. మాధ్యమాల్లో స్క్రోలింగ్‌ చూస్తున్నా.

ఎప్పుడు మాట్లాడినా గొడవపడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు గొడవకు దిగడం అంతా చూశా’నని చెప్పారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు మరింత ఉత్సాహం ప్రదర్శిస్తూ.. ‘అశోక్‌బాబులో రౌడీని చూశాం..  మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్‌.. ఏయ్‌ అని బాగా అరిచారు.. కొంచెం ఉంటే కొట్టేవాడు.. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడు’ అని చంద్రబాబుకు వివరించారు. పార్టీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా కన్పించారు. పెద్దల సభలో హుందాగా ఉండాలని చెప్పకుండా వారిని చంద్రబాబు ప్రశంసించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.  
 

>
మరిన్ని వార్తలు