బుద్ధా వెంకన్నపై మరోసారి కేశినేని నాని ట్వీట్‌

14 Jul, 2019 18:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ట్విటర్‌ వేదికగా టీడీపీ నేతల మధ్య వార్‌ కొనసాగుతోంది. తాజాగా బుద్ధావెంకన్నపై టీడీపీ అసంతృప్త ఎంపీ కేశినేని నాని మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్‌ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్‌ చేశారు. 

అంతకుముందు టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి కేశినేని నాని పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు..నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు.. దౌర్బాగ్యం’ అంటూ వెంకన్నను ఎద్దేవా చేశారు. గతకొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్‌లో యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో కేశినేని నాని  ఆయనను టార్గెట్‌ చేసి.. ట్వీట్‌ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ ‍ట్వీట్‌కు బుద్దా వెంకన్న కూడా కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం.. నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. మొత్తానికి ఇద్దరు నేతలు పరస్పరం టార్గెట్‌ చేసుకుంటూ చేస్తున్న ట్వీట్స్‌తో టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడి.. రచ్చ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు