రాత్రైతే కాళ్లు పట్టడమే పని.. ఒంటినిండా అదే!

22 Jun, 2018 18:30 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్‌ నాయకత్వంలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాత్రైతే మీరు చేసేపనేంది?: ‘‘ఉద్యమం పేరుతో వేలమంది పిల్లల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారం అనుభవిస్తోన్న కేకే లాంటి చాలా మంది నాయకులు అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు. కనీసం కాలిగోటికైనా బుల్లెట్‌ తగిలి ఉండదు. వీళ్లందరికీ ఒకటే పని.. రాత్రైతే కేసీఆర్‌ కాళ్లు పిసకడం, మందుతాగడం తప్ప ఇంకోటి చేయరు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. టీఆర్‌ఎస్‌ నాయకులు తనపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌కు కేసీఆర్‌ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణలోని సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయరంటూ టీజీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు కేకే, నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌ తదితరులు ఫైరైన సంగతి తెలిసిందే.

నారా లోకేశ్‌ దగ్గరికిరా: ‘‘కేకే ముఖానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి అవసరమా? ఆయనకు మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టే నా మాటలు పిచ్చివిగా అనిపించాయి. అసలు నేనన్నదాంట్లో తప్పేముంది? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కోసం తెలంగాణ కూడా మాట్లాడాల్సిందే. ఎందుకంటే 60 ఏళ్ల ఉమ్మడిగా ఉన్నాం. ఎవరు అవునన్నా, కాదన్నా హైదరాబాద్‌ నిర్మాణంలో ఆంధ్రులు, రాయలసీమ వాసుల కష్టం కూడా ఉంది. గతంలో కేటీఆర్‌, కవితలు కూడా ఏపీ హక్కుల కోసం మాట్లాడటం మనం చూశాం. ఇప్పుడీ కేకే నన్ను తిట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కేకే.. నీకు వ్యవహారం తెలియకుంటే హరీశ్‌, కవిత, కేటీఆర్‌ల్ని చూసి నేర్చుకో, లేదా, మా మంత్రి నారా లోకేశ్‌ దగ్గరికి రా’’ అని టీజీ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోకుండా తన ఒంట్లో ప్రవహించేది పౌరుషంతో కూడిన సీమనెత్తురైతే, కేకే ఒంటినిండా సారాయి నిండి ఉంటుందని అన్నారు.

కేసీఆర్‌ ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఒకవైపు పొగుడుతూనే చురకలు అంటించారు ఎంపీ టీజీ వెంకటేశ్‌. ‘‘మొన్న ఢిల్లీలో విపక్ష ముఖ్యమంత్రులంతా ఒకచోట ఉంటే, కేసీఆర్‌ మాత్రం ప్రధాని మోదీని కలుస్తారు. అంటే, ఆయన ఏం మెసేజ్‌ ఇవ్వదల్చుకున్నారు? ప్రపంచమంతా పర్యటిస్తోన్న మోదీ నిజాయితీ పరుడే కావచ్చు. కానీ పరిపాలనాదక్షత ఏది? ముందు ఇంటగెలిచి ఆ తర్వాతకదా రచ్చగెలవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఓ భస్మాసుర హస్తంలా మారిది. ఇది గుర్తించి తెలంగాణ నాయకులంతా ఆంధప్రప్రదేశ్‌ గురించి పోరాడాలి. అలా చేస్తేనే ఇరు రాష్ట్రాలకు మంచిది’’ అని టీజీ అన్నారు.

టీజీ కావరం: టీడీపీలో నోటుకు సీటు వ్యవహారంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎంపీ టీజీ అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘టీజీ డబ్బులిచ్చి ఎంపీ సీటు కొనుక్కున్నారని మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఏమంటార’న్న ప్రశకు... ‘‘ఏ వెధవ లం..కొడుకు అన్నాడామాట?’’ అని విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వెంటనే గొంతు సవరించుకుని ‘‘నా మాటలు మోత్కుపల్లిని ఉద్దేశించికాదు, ఆయనకు సమాచారం ఇచ్చినవారిని అంటున్నా..’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు