టీడీపీకి వచ్చే సీట్లు 13కు ఎక్కువ.. 25కు తక్కువ 

20 Apr, 2019 05:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి  మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 

పట్నంబజారు(గుంటూరు): రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి 13 సీట్లకు ఎక్కువ.. పాతికకు తక్కువగా ఉండగా.. 130 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ కనపడదని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్‌ 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో వన్‌సైడ్‌ వార్‌ నడిచిందన్నారు.  

వైఎస్‌ జగన్‌ను విమర్శించడమా?! 
టీడీపీ పాలనలో హోంమంత్రిగా వ్యవహరించిన నిమ్మకాయల చినరాజప్ప కనీసం హోంగార్డు పోస్టింగ్‌ కూడా మార్చలేదని.. ఎక్కడైనా హోంమంత్రికి డీజీపీ సెల్యూట్‌ చేస్తారని, అయితే డీజీపీకి సెల్యూట్‌ చేసే చినరాజప్ప వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మోదుగుల అన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ దాడులు చేసిందని వ్యాఖ్యలు చేస్తున్న చినరాజప్ప.. ప్రతిపక్షం దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చున్నారా.. అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో విఫలమైన చినరాజప్ప  రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అత్యవసరంగా చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో చేపట్టిన సమావేశం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకేనని మోదుగుల విమర్శించారు.   

>
మరిన్ని వార్తలు