అమిత్‌ షా గో బ్యాక్‌: టీడీపీ నిరసన

21 Feb, 2019 12:06 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి:  రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన టీడీపీ.. నేడు బీజేపీ నాయకుల పర్యటనలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ కొత్త నాటకానికి తెరతీసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గురువారం రాజమండ్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కూడా టీడీపీ నేతలు.. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామనే విధంగా కటింగ్‌ ఇచ్చారు. బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చిన టీడీపీ నేడు నిరసనలకు దిగడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

అమిత్‌ షా క్వారీ సెంటర్‌ వద్ద బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అక్కడ అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ ప్లే కార్డులు ప్రదర్శిస్తు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్న ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దుర్గాయాదవ్‌ సహా కార్యకర్తలను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్న అమిత్‌ షా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై లబ్ధిదారులతో చర్చించనున్నట్టు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.


 

మరిన్ని వార్తలు