నితీశ్‌ కుమార్‌పై విమర్శల వర్షం కురిపించిన తేజస్వీ

16 May, 2019 08:59 IST|Sakshi

పట్నా : బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మీద విమర్శల వర్షం కురిపించారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తారని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నేడు మొహం చాటేశాడు ఎందుకు అని నితీశ్‌ కుమార్‌ని ప్రశ్నించారు తేజస్వీ. సీఎం నితీశ్‌ కుమార్‌ నియోజకవర్గమైనా నలందలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ యాదవ్‌. ఈ క్రమంలో ఆయన సీనియర్‌ రిపోర్టర్‌ ప్రణయ్‌ రాయ్‌తో ముచ్చటించారు. నలంద ప్రజలకు నితీశ్‌ కుమార్‌ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో నితీశ్‌ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు తేజస్వీ.

అంతేకాక గతంలో ‘జనాలు నా మొహం చూసి ఓటు వేస్తారని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిని చూపించి ఓట్లు వేయమని కోరుతున్నారు. భారత ఆర్మీని, ఒకప్పుడు తాను ఎంతగానో ద్వేషించిన మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు. ఇప్పుడు ఆయన అందమైన మొహం ఎక్కడ’ అని తేజస్వీ ప్రశ్నించారు. ఉ‍గ్రవాదుల మీద దాడుల చేయడం మాత్రమే నిజమైన దేశ భక్తి అనిపించుకోదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. వారిని ఆర్థికంగా బలంగా తయారు చేయడం కూడా దేశభక్తే అన్నారు. పేదరికం తొలగించడం.. యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలన్ని కూడా దేశభక్తి కిందకే వస్తాయన్నారు తేజస్వీ.

మరిన్ని వార్తలు