సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు నగర పర్యటనకు ముందుకొచ్చిన వేళ పలువురు సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడి పార్టీని బలహీనపరచ్చొదంటూ భాజాపా సీనియర్లు హితవు పలుకుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా నష్టపోయామని.. కనీసం హైదరాబాద్లోనైనా పార్టీని రక్షించుకుందామని వారు సూచిస్తున్నారు. ఈ మేరకు ఓ సీనియర్ నేత బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీకి సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. వరుస తప్పిదాలతో పార్టీకి నష్టం కలిగించకండంటూ అందులో ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారంట. ఓవైపు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరగటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే చిక్కడపల్లి, ముషీరాబాద్, నారాయణగూడ ప్రాంతాల్లో నేడు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి కేటీఆర్తోపాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు.