సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

18 Jul, 2019 02:40 IST|Sakshi

బీజేపీ ఎంపీలు అరవింద్, సంజయ్, సోయం ధ్వజం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. ఓటమి భయంతో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణను కేసీఆర్‌ ఏకపక్షంగా ముందుకు జరిపారని ఆరోపించారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపూరావు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అరవింద్‌ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయంతోనే కేసీఆర్‌ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారని, అలాగే అసెంబ్లీ ఫలితాలు వెల్లడికాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లారన్నారు.

ఇప్పుడు కూడా మన్సిపల్‌ ఎన్నికలను ముందుకు జరిపారని ధ్వజమెత్తారు. ఒకవైపు బీజేపీని సీరియస్‌గా తీసుకోవద్దు, వారికున్నది నలుగురు ఎంపీలే అని చెబుతూనే బీజేపీ, ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌ వణికిపోతున్నారని విమర్శించారు. తాము ఉన్నది నలుగురు ఎంపీలే అయినా తెలంగాణలో నాలుగు దిక్కు ల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెడతామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం తేలకముందే, ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉన్నా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారంటూ బండి సంజయ్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు