అభివృద్ధి కోసం బీజేపీకే ఓటేయండి

27 Mar, 2019 05:39 IST|Sakshi

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాల్సిన అవసరం లేదని, బీజేపీకి ఓటు వేస్తే మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం బీజేపీకే ప్రజలు పట్టంకట్టాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ చావుకు దగ్గరలో ఉందని, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పార్టీని వీడిపోతున్నారన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ కొత్త పథకం ప్రకటించిందని, రాహుల్‌గాంధీ అమలుకు నోచుకోని హామీలను ఇస్తున్నారన్నారు.

గతంలో కాంగ్రెస్‌ పేదలను వాడుకుని వదిలేసిందన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి భగవంతరావు మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై అనర్హత వేటు వేయాలన్నారు. హైదరాబాద్‌లో ఆయనకు రెండు ఓట్లు ఉన్నాయని, ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఆ విషయాన్ని గుర్తించి ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ కూడా తన నామినేషన్‌ పత్రాల్లో భూమికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన నామినేషన్‌ను కూడా తిరస్కరించాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
మీడియాతో మాట్లాడుతున్న కృష్ణసాగర్‌. చిత్రంలో భగవంతరావు

మరిన్ని వార్తలు