నేడే మంత్రివర్గ విస్తరణ.. హరీశ్‌కు ఛాన్స్‌!

7 Sep, 2019 22:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన తమిళ సై సౌందర్‌రాజన్‌ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు.

కాగా విస్తరణలో భాగంగా మరో నలుగురికి మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీశ్‌రావుతో పాటు కేటీఆర్‌కు చోటు కల్పించినట్లు సమాచారం. ఒక మహిళకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై కౌంటర్‌ ఇచ్చే మంత్రులు ఎవరూ లేకపోవడంతో హరీశ్‌, కేటీఆర్‌లను మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొత్త గవర్నర్‌ చేతుల మీదుగా  ఆదివారం ప్రమాణ స్వీకారం జరగనుంది. 

మరోవైపు ఈ నెల 9న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చీఫ్‌ విప్‌, విప్‌లను నియమించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లుగా గొంగిడి సునీత, గంప గోవర్థన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతరావు, బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు.

మరిన్ని వార్తలు