సిట్టింగ్ నేతలందరికీ టికెట్లు: కేసీఆర్

11 Mar, 2018 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇతరత్రా అంశాలపై కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. సిట్టింగ్ నేతలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలపై ఆందోళన అక్కర్లేదని, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా 106 సీట్లలో తమదే విజయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ, మండలి సమావేశాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. దేశ వ్యాప్తంగా మార్పు కోసమే థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేశానన్న కేసీఆర్.. అసెంబ్లీలో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలకు సూచించారు.

‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తాను. అన్ని పార్టీల నేతలను కలుస్తా. ప్రత్యామ్నాయ రాజకీయ అవసరాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నేతలకు వివరిస్తానని’ కేసీఆర్ అన్నారు. అంతకుముందు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ) పేర్లను కేసీఆర్ ప్రకటించారు. 

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమాశాలు
ఈ నెల 12నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం తెలంగాణ బీఏసీ భేటీ అయ్యి ఎజెండా ఖరారుపై టీఆర్ఎస్ చర్చించనుంది. ఈ నెల 15న తెలంగాణ సర్కార్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

మరిన్ని వార్తలు