పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్‌ని హెచ్చరించిన కాంగ్రెస్‌ నేతలు

23 Mar, 2019 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ ఫిరాయింపుల విషయమై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శనివారం గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై కాంగ్రెస్‌, టీడీపీ వేర్వేరుగా స్పీకర్‌, చైర్మన్‌లకు ఫిర్యాదు చేశాయన్నారు. కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. స్పీకర్‌, చైర్మన్‌పై కేసీఆర్‌ ఒత్తిడి ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌.. రాజ్యాగానికి విరుద్ధంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ చర్యల వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీలు మారిన వాళ్లు రాస్తున్న లేఖలన్ని ఒకేలా ఉన్నాయని.. అవన్ని సీఎంఓ నుంచే వస్తున్నాయని వీరప్ప మొయిలీ ఆరోపించారు. చీఫ్‌ మినిస్టర్‌ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. లేదంటే లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు...19 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ మౌనంగా ఉండొద్దని, బహిరంగంగా ఖండించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.

మరిన్ని వార్తలు