కరోనా పరీక్షల్లో రాష్ట్రం విఫలం

29 May, 2020 03:08 IST|Sakshi
గురువారం ఒడిశాకు చెందిన వలస కార్మికులను బస్సులో వారి స్వస్థలాలకు పంపిస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం ఫెయిల్‌: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షలు అతి తక్కువగా చేసిన రాష్ట్రం తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైద్య పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రోజుకు 5 వేల పరీక్షలు చేస్తామని వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారని, ఇప్పుడు అంత సంఖ్యలో పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదో స్పష్టం చేయాలన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టి కాయలు వేసినా ప్రభుత్వానికి సోయి రావడం లేదన్నారు.

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని, వలస కార్మికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేకపోయిందన్నారు.  కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు 50 లక్షల మెట్రిక్‌ టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కొన్ని రకాల విత్తనాలు అమ్మాలి, మరికొన్ని రకాల విత్తనాలు అమ్మొద్దని ఆదేశాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ‘స్పీక్‌అప్‌ ఇండియా’పేరిట సామాజిక మాధ్యమాల్లో పోరాటం చేస్తున్నదన్నారు. ఈ పోరాటం విజయవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. 27 వేల మంది కేడర్‌తో మాట్లాడి, ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆన్‌లైన్‌ పోరాటం చేపట్టినట్లు తెలిపారు.

వలస కూలీలకు బస్సు ఏర్పాటు: వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను హైదరాబాద్‌ నుంచి పంపించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. గురువారం  గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్‌ అధ్యక్షుడు వినోద్‌ తదితరులు జెండా ఊపి బస్సు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు