ఐక్యంగా పోరాడుదాం: సుధాకర్‌

14 Mar, 2020 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. శుక్రవారం టీజేఎస్‌ కార్యాలయానికి ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై చర్చించి రెండు పార్టీలు కలసి ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరంకుశ పాలన
తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని తెలంగాణ చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. శుక్రవారం ఆదర్శ్‌నగర్‌లోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ తెలంగాణను ఏమీ చేయలేకపోయింది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ప్రజలందరినీ అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెరుకు సుధాకర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు